మానవత్వాన్ని చాటుకోవడంలో రామోజీ గ్రూప్ కనబరిచిన ఔదార్యాన్ని ప్రశంసించిన కేరళ సీఎం విజయన్... భవిష్యత్తులో కేరళ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా రామోజీ గ్రూప్ను ఆహ్వానించారు..ఈ సందర్బంగా ఈనాడు ఎండీ కిరణ్ సహా రామోజీ గ్రూప్ ప్రతినిధులను కేరళ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
ప్రకృతి ప్రకోపానికి బలై... కేరళ వరదల్లో... ఇళ్లు కోల్పోయిన అలెప్పీ వాసులను ఆదుకునేలా... ఈనాడు నిర్మించి ఇచ్చిన ఇళ్లు లబ్ధిదారులకు చేతికి అందాయి. కష్టాల కడలిలో చిక్కుకు పోయి... బతుకు దుర్భరమై జీవిస్తున్న ఆ బడుగు జీవులంతా కొత్త ఇళ్లలోకి ప్రవేశించే శుభ ఘడియలకు అలెప్పీలోని హోటల్ కేమ్ల్యాట్ కన్వెన్షన్ హాల్ వేదికగా నిలిచింది. రామోజీ గ్రూప్ తరఫున ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్ విశిష్ట అతిథిగా పాల్గొనగా...కేరళ మంత్రులు థామస్ ఐజక్, సుధాకరన్, తిలోత్తమన్ పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీ, అలెప్పీలో ఈనాడు ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ పాల్గొన్న వారిలో ఉన్నారు.
సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా లబ్ధిదారులు నూతన గృహాల తాళం చెవులను అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేరళ సీఎం విజయన్... రామోజీ గ్రూప్ తీసుకున్న సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. హైదరాబాద్ నుంచి అలెప్పీ వరకూ విస్తరించిన మానవత్వమే.. ఈరోజు నూతన గృహాల ఆవిష్కరణ కార్యక్రమానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులో కేరళ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కావాల్సిందిగా విజయన్... రామోజీ సంస్థలకు ఆహ్వానం పలికారు.
ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రజలకు మద్దతుగా... అండగా నిలవటం రామోజీ గ్రూప్ బాధ్యతగా భావిస్తుందని ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్ అన్నారు. కేరళ వరదలు, గుజరాత్ భూకంపం సహా పదికి పైగా ప్రకృతి విపత్తులలో రామోజీ గ్రూప్ ప్రజల పక్షాన నిలబడిన విధానాన్ని కిరణ్...అలెప్పీ వాసులకు తెలియచేశారు. రామోజీ గ్రూప్ పిలుపు మేరకు మానవత్వంతో ముందుకు వచ్చి ఔదార్యాన్ని చాటుకున్న ప్రజలు... రామోజీ గ్రూప్ ఉద్యోగుల వల్లనే ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. ఈ సందర్బంగా ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ కృష్ణతేజను ఈనాడు ఎండీ కిరణ్ ప్రశంసించారు.
ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా...అలెప్పీ వాసులను ఆదుకునేలా 121ఇళ్లను నిర్మించి ఇచ్చిన... రామోజీ గ్రూప్ ను...సీఎం విజయన్ సహా కేరళ ప్రభుత్వం మెమొంటో తో సత్కరించింది. ఇళ్ల నిర్మాణం లో కీలక పాత్ర పోషించిన కృష్ణతేజను, కుటుంబ శ్రీ సంస్థ అధికారులకు సీఎం ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈనాడు నిర్మించిన ఇళ్లను పొందిన లబ్ధిదారులంతా సంతోషం వ్యక్తం చేశారు. తమ జీవితాల్లో మరిచిపోలేని సహాయం...అందించారంటూ రామోజీ గ్రూప్నకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: 'జీవితంలో మరచిపోలేని సాయం అందించారు'