గోదావరి దగ్గర నీటిని మళ్లించే ప్రదేశంగా ఇచ్చంపల్లినే ఖరారు చేయాలని నిర్ణయించిన టాస్క్ ఫోర్సు.. ఆ మేరకు తుది డీపీఆర్ రూపకల్పనకు సిద్ధమైంది. ఈలోపు భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంతో పాటు వారి అభిప్రాయాలు తెలుసుకుని చోటు కల్పించవచ్చని భావించారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనలేదు. ఆ మినిట్స్ మార్చి ఆఖరులో రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. దీనిపై స్పందించాల్సి ఉంది. అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడేలా... జాతీయ జల అభివృద్ధి సంస్థకు, కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అవలంబించబోయే విధానం విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు సాగుతోంది.
తెలంగాణలోని ఇచ్చంపల్లి లేదా, జానంపేట నుంచి గోదావరి జలాలు మళ్లించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఉన్నంతలో జానంపేట ప్రతిపాదన ఏపీకి అనుకూలంగా ఉందని గతంలో రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. జానంపేట దగ్గర ఇప్పటికే తెలంగాణ వివిధ ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించి చేపడుతున్నందున ఆ ఆయకట్టు కొత్త ప్రాజెక్టులోకి వస్తుందని భావించి ఇచ్చంపల్లి నుంచి మళ్లించడమే ఉత్తమమని టాస్క్ఫోర్సు దాదాపు తుది అభిప్రాయానికి వచ్చింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ 20 టీఎంసీల దాకా నష్టపోతుందని రాష్ట్ర జలవనరుల నిపుణులు చెబుతున్నారు.
ఎగువ నుంచి గోదావరి నీటిని మళ్లించడం వల్ల దిగువన ఉన్న ఆంధప్రదేశ్ ప్రయోజనాలు ఏ మేరకు దెబ్బతింటాయనే అంశంపైనా చర్చ సాగుతోంది. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటే దిగువ లభ్యత ఎంత అనేది ప్రశ్నార్థకమే. పోలవరానికి నష్టం కలగని విధంగా మళ్లింపు ఉండాలనేది ఏపీ ఆలోచన. పైగా పోలవరం, గోదావరి డెల్టా వ్యవస్థ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి నుంచి కరవు ప్రాంతమైన పెన్నాకు నీటి తరలింపు తదితర ప్రాజెక్టుల్లో కొన్నింటిని ఇప్పటికే చేపట్టడం, కొన్ని ప్రతిపాదనల దశలో ఉండటం వల్ల వాటిని
పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
* నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా మహానది నుంచి గోదావరికి 140 టీఎంసీల వరకు మళ్లించాల్సి ఉంది. మహానది నుంచి నీటిని మళ్లించాలంటే అంతకన్నా ముందు సువర్ణముఖి నుంచి మహానదికి నీళ్లు మళ్లించాలని ఒడిశా ప్రభుత్వం కోరుతోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధమైందని జాతీయ జల అభివృద్ధి సంస్థ పేర్కొంది.
బనకచర్ల మీదుగా..
గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా సోమశిల ద్వారా కావేరికి తీసుకువెళ్లాలనేది ప్రతిపాదన. బనకచర్ల కాంప్లెక్సుకు నీటిని తీసుకువెళ్లి అక్కడి నుంచి తమిళనాడుకు మళ్లించాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సోమశిలకు నీటిని మళ్లించడం వల్ల ప్రస్తుతం ఉన్న ఆయకట్టు మీదుగా సాగుతుందని, అలా కాకుండా బనకచర్లకు మళ్లించాలని కోరే యోచన ఉంది. అన్ని ఆలోచనల్నీ మేళవించి సమగ్రవ్యూహంతో జాతీయ జల అభివృద్ధి సంస్థకు, కేంద్రానికి లేఖ రాసే యోచనలో ఉన్నారు.
ఇదీ చదవండి: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ