బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ నమ్మించి.. కేవైసీ పేరుతో నగదు దోచుకునే ముఠాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. విజయవాడలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి మొదట వాట్సాప్ ద్వారా ఆర్బీఎల్ బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయమని సంక్షిప్త సమాచారం వచ్చింది. అందులో చెప్పిన విధంగానే అతడు చేశాడు. తర్వాత రోజు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. వివరాలు నమోదు కాలేదని చెప్పాడు. బయోమెట్రిక్ చేయాలని చెప్పగా అదీ చేశాడు. తర్వాత రోజు మళ్లీ ఫోన్ చేసిన ఆ వ్యక్తి... మీ కార్డు వివరాలు సరిచేయాలి, మీ ఫోన్కి సంక్షిప్త సందేశాలొస్తాయి.. అందులో ఉన్న వివరాలు చెప్పండని కోరాడు.
కొద్దిసేపటి తర్వాత సందేశాలు రాగానే కోడ్ చెప్పమన్నాడు. ఆ కోడ్ సంఖ్యల రూపంలో కాకుండా అక్షరాలుగా ఉన్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి నెంబరు ట్రూకాలర్లో ఆర్బీఎల్ బ్యాంకు అని ఉండటంతో నమ్మి బాధితుడు వివరాలు చెప్పాడు. వాటిని చెప్పగానే బ్యాంకు ఖాతాల్లోంచి 40 వేల నగదు మాయమయ్యింది. ఈ విషయం చెప్పేలోపు ఫోన్ కట్ చేశాడు. లబోదిబోమంటూ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పశ్చిమ బంగ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డ్ ముఠాలు మకాం వేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఠా సభ్యులు వివిధ బ్యాంక్ల ఖాతాదారుల ఏటీఎం కార్డుల నంబర్లు, పేర్లు, వివరాలను దిల్లీ, ముంబయిలలో పొరుగు సేవల సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
కొత్త సిమ్కార్డులు తీసుకుని డెబిట్కార్డుదారులకు ఫోన్చేస్తున్నారు. పేరు, చిరునామా, వయసు సహా వివరాల్ని సరిగ్గా చెబుతున్నందున నిజంగా బ్యాంకు ప్రతినిధులే అని కార్డుదారులు నమ్మేస్తున్నారు. ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. ప్రతి కార్డుకు సాధారణంగానే బీమా సదుపాయం ఉంటుంది. తన ప్రమేయం లేకుండానే లావాదేవీ జరిగినట్లు బాధితుడే రుజువు చేసుకోవాలి. అలా చేస్తే మోసపోయిన డబ్బును సులభంగానే తిరిగి రాబట్టే వీలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: