కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండో సారి హైకోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించడంలో జాప్యం చేసినందుకు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఎస్ను ఆదేశించటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హైకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు.
రంగుల అంశంలో జీవో 623ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని దానిపై విచారణ జరిగే అవకాశముందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను వెకేషన్ బెంచ్లో చేస్తామని విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ నుంచి సీఎస్కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చింది. ఈ అంశంపై మొదటి రోజు సైతం సీఎస్ కోర్టుకు హాజరయ్యారు.
ఇది చదవండి: అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి నోటీసులు