పోలీసు శాఖను కరోనా కలవరపెడుతోంది. కానిస్టేబుల్ నుంచి ఏడీసీపీ స్థాయి అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. విజయవాడ సీపీ కార్యాలయంలోనూ తాజాగా ఓ ఉన్నతాధికారికి కొవిడ్ నిర్ధరణ కావడంతో ఆ శాఖలో గుబులు మొదలైంది. పోలీస్ సిబ్బందికి సంబంధించి అన్ని రకాల వ్యవహరాలను పర్యవేక్షించే విభాగంలో పనిచేసే మరో ఉన్నతాధికారికి వైరస్ సోకింది. దీంతో పోలీసుశాఖ మరింత అప్రమతమైంది. వారు నిధులు నిర్వహించే ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.
ఉద్యోగి భర్తకు పాజిటివ్...
కమిషనరేట్ పరిధిలో సదరు అధికారి దగ్గర పనిచేసే ఓ దిగువస్థాయి సిబ్బంది భర్తకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె పరీక్షలు చేయించుకుని స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఆమె నిత్యం సదరు అధికారి దగ్గరకు వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటుంది. ఆమె ద్వారానే వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
అప్రమత్తం..
కేసుల సంఖ్య పెరుగుతుండటం కారణంగా విజయవాడ కమిషనరేట్ పరిధితో పాటు... కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్, సేఫ్టీ టన్నెల్స్ను ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాస్కులు, గ్లౌజులు ధరించడం, శానిటైజర్ల వాడకం వంటి వాటిపై పోలీసులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. 55 ఏళ్లు పైబడిన సిబ్బందికి క్షేత్రస్థాయిలో కాకుండా.. స్టేషన్ విధులకే పరిమితం చేశారు.
ఏమైనా వ్యాధి లక్షణాలు ఉంటే... వెంటనే హోం ఐసోలేషన్లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా పనిమీద ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే... ఇతర అధికారులతో కలిసి వెళ్లకుండా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తున్నారు .
ఇదీ చదవండి: