తన భార్య సుహారిక మృతిపై అనేక అనుమానాలున్నాయంటూ భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును కొందరు తప్పుదోవ పట్టించారని, వారికి సుహారిక తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారని 24వ తేదీన సైబరాబాద్ సీపీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. మే 28న 38ఏళ్ల సుహారిక మిత్రుడు పవన్రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.
‘పవన్, ప్రవీణ్ (సుహారిక సోదరి భర్త), వివేక్, వివాస్, కావాలనే ఏదో దాస్తున్నారని ఫణీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు కుప్పకూలిన సుహారికను మధ్యాహ్నం 12.45 వరకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. చనిపోయిన 2 నుంచి 3 గంటల తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం వల్లనే సీపీఆర్ చేసినప్పుడు నోటి నుంచి రక్తం బయటకొచ్చిందని కూడా స్పష్టంచేశారు. అంటే అక్కడేదో జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో మరణించినట్లు తనకి చెప్పారని... శవపరీక్ష నివేదికలోనేమో ఇతర కారణాలు పేర్కొన్నారని వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని నాపై ఒత్తిడి తెచ్చారని... సుహారిక మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పడం ఆశ్చర్యమనిపించిందని ఫణీంద్ర పేర్కొన్నారు.
సుహారికకు మద్యం, డ్రగ్స్ సేవించే అలవాటు లేదని.... అలాంటిది ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుని మరణించి ఉంటుందని ప్రవీణ్ చెప్పడంపై అనుమానంగా ఉందని తెలియజేశాడు. ఆరోజు ఏం జరిగిందని అడిగితే... మా అత్త, మామ.. నీకవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారని సీపీకి తెలిపారు. ఆ నలుగురు ఆరోజు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చూడండి.