TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. సోమవారం తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించనున్నారు. అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. దీనికోసం భక్తులు సోమవారం ఉదయం 10గంటల నుంచి జూన్ 29వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
టికెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. వీరు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి.
సర్వదర్శనానికి 12 గంటలు.. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. ధర్మదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులు ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, టీబీసీ వరకు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది.
ఇవీ చూడండి: