తిరుపతి నగరంలోని ట్రాఫిక్ సమస్యలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన గరుడ వారధి పైవంతెన నిర్మాణానికి... నిధుల కేటాయింపులో నెలకొన్న సందిగ్ధతకు త్వరలో తెరపడనుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్... టీఎస్సీసీఎల్ సంయుక్తంగా వారధి నిర్మాణాన్ని చేపట్టాయి. 648 కోట్ల రూపాయల వ్యయంలో తితిదే రూ.458.28 కోట్లు, టీఎస్ఎస్సీఎల్ రూ.225.72 కోట్లు ఖర్చు చేసేలా గతంలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొన్నాళ్లు నిర్మాణ పనులకు బ్రేక్ పడి, తర్వాత ప్రారంభమైనా... మునుపటి వేగంతో జరగలేదు. వారధి ఆకృతుల్లో మార్పు చేయాలని తితిదే బోర్డు తీర్మానం చేయడం వల్ల పైవంతెన నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తితిదే నిధులను కేటాయించకపోయినా టీఎస్సీసీఎల్ వాటా నిధులతో 30 శాతం పనులు పూర్తయ్యాయి.
తితిదే సమావేశం
వారధి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో తితిదే బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నగరపాలక సంస్థ, తితిదే అధికారులు సమావేశమయ్యారు. ఇరు విభాగాల ఇంజినీర్లతో పాటు ఓ నిపుణుల బృందం... వారధి నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి దాని ఆకృతులు, పొడవు పెంచడం వంటి అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. నిపుణులు రూపొందించిన నివేదికను ఈనెల 29న జరగనున్న తితిదే బడ్జెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రానున్న ఆర్థిక ఏడాది తితిదే బడ్జెట్లో... గరుడ వారధి నిర్మాణాలకు నిధులు కేటాయించనున్నారు.