తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి, నంది చిత్రపటానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి మీన లగ్నంలో నందీశ్వరుడి చిత్ర పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు.
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్లతో ధ్వజస్తంభానికి ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో తితిదే ఈఓ జవహర్రెడ్డితో పాటు ఆలయాధికారులు పాల్గొన్నారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయ ఆవరణలోనే నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: తిరుమలకు ఉప రాష్ట్రపతి..రేపు శ్రీవారి దర్శనం