సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబానికి నెల్లూరుతో విడదీయలేని అనుబంధం ఉందని.. మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నాలుగు తరాల నుంచి తాము ఇక్కడ నుంచే రాజకీయాలు చేసినట్లు గుర్తుచేశారు. నెల్లూరు తమ జీవితంలో ఓ భాగమని.. ఎవరూ తమ నుంచి విడదీయలేరని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుస్తానని.. ఇందుకు ఎన్నికలే అవసరం లేదని చెప్పారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలోని ఒక్క మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా.. మొత్తం 20 సర్పంచి స్థానాలకుగాను వైకాపా మద్దతుదారులు 18 స్థానాల్లో విజయం సాధించినట్లు ఎమ్మెల్యే ఆనం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని.. రహదారులతో పాటు మున్సిపాలిటీలో పలు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రెండో దశ పంచాయతీ పోరులో గెలుపొందిన సర్పంచ్లు, కలువాయి మండల పార్టీ కార్యకర్తలు ర్యాలీగా ఆయన నివాసానికి తరలిరాగా.. మాజీ మంత్రి ఇంట్లో సందడి నెలకొంది. విజయం సాధించిన అభ్యర్థులను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: