రాష్ట్రంలో అత్యధికంగా శీతల గోదాములు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 130 శీతల గోదాములున్నాయి. ఇందులో గుంటూరు నగరం చుట్టుపక్కనే 100 వరకూ ఉన్నాయి. మిగతావి పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయం ఎక్కువగా జరిగే జిల్లా కావడంతో.. రైతులు తమ పంట ఉత్పత్తులను వీటిలో నిల్వ ఉంచుతారు. మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకుంటారు. మన రాష్ట్రంలో మిర్చి క్రయవిక్రయాలకు గుంటూరు యార్డు ఎంతో కీలకం. కొవిడ్ నిబంధనలు అనుసరించి ప్రస్తుతం గుంటూరులోని మిర్చియార్డుకు సెలవులు ఇచ్చారు. జూన్ 6 తర్వాత కార్యకలాపాలు తిరిగి మొదలుకానున్నాయి. ఈలోగా రైతులు పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడకుండా.. నేరుగా వ్యాపారాలకు విక్రయించే వెసులుబాటు కల్పించారు. కానీ సరైన పర్యవేక్షణ లేక ధరలు తగ్గిపోయాయి. దీంతో రైతులు మిర్చిని శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలో మరో కొత్త వ్యాధి.. ఈసారి వైట్ ఫంగస్
గత రెండు వారాలుగా మిర్చియార్డుకు రావాల్సిన సరకు ఎక్కువగా కోల్డ్ స్టోరేజిలకే వెళ్తోంది. ప్రస్తుతం గోదాముల్లో నిల్వ చేసి అధిక ధర వచ్చినప్పుడు పంటను విక్రయించుకోవాలని రైతులు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శీతల గోదాముల్లో 90 లక్షల బస్తాల మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 90 శాతానికి పైగా గోదాములు సరకుతో నిండిపోయాయి. ప్రకృతి అనుకూలించి మంచి పంట రావడంతో.. రైతులు సగం పంటను మంచి ధరకు మిర్చియార్డులో అమ్ముకున్నారు. మిగతా పంటను శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. కరోనా ఆంక్షలు తొలగి అంతర్జాతీయ ఎగుమతులు ఊపందుకుంటే ధరలు సైతం పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే శీతల గోదాములకు గిరాకీ పెరిగిందని వాటి నిర్వహకులు చెబుతున్నారు.
గత నెలలో క్వింటాల్ కు 15వేల రూపాయల వరకూ పలికిన తేజ రకం మిర్చి ఇప్పుడు రూ.12వేలకు పడిపోయింది. ఎగుమతులు ప్రారంభమైతే వీటి ధర మళ్లీ పెరిగే అవకాశముంది. విదేశాల్లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతులు ఎక్కువగా శీతల గోదాముల్లో నిల్వకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా ఎగుమతి రకాలది ఇదే పరిస్థితి. - ప్రకాష్ రావు, శీతల గోదాముల సంఘం అధ్యక్షులు
ఇదీ చదవండి: