marriages : మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్న వీరు పుట్టుకతోనే దివ్యాంగులు. వారికి ఉన్న శారీరక లోపం కారణంగా పెళ్లి అనేది ఆమడ దూరంలో ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. తమ జీవితాలు ఇంతేనా అనుకుని నిస్తేజంగా ఉన్న తరుణంలో, గుంటూరులోని స్వచ్ఛంద సంస్థ చేసిన ప్రయత్నం వీరి జీవితాల్లో కొత్త వెలుగు నింపింది.
దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ..
దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ నిర్వహించిన పరిచయ వేదిక ద్వారా.. ఒకరినొకరు ఇష్టపడిన వారికి ఆ సంస్థ ఆధ్వర్యంలో వివాహాలు జరిపిస్తున్నారు. ఈ పరిచయ వేదికలకు వచ్చేవారిలో సాధారణ యువతీ, యువకులూ ఉంటున్నారు. గుంటూరులో జరిగిన వివాహ వేడుకలో సమర్థకుమార్ అనే యువకుడు.. విజయలక్ష్మి అనే దివ్యాంగురాలిని పెళ్లాడి ఆదర్శంగా నిలిచారు. మిగతా రెండు జంటలు దివ్యాంగులే. వివాహం ద్వారా ఒక్కటైన జంటలకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా సంస్థ తరఫున రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తమకు జీవితంలో పెళ్లి కాదనుకున్న తరుణంలో.. ఇన్ఫో సొసైటీ ముందుండి పెళ్లి జరిపించడం పట్ల నూతన వధూవరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరుకు చెందిన నాగశ్రీ అనే మహిళ.. దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటి సంస్థను నిర్వహిస్తున్నారు. ఆమె కూడా దివ్యాంగురాలు కావటంతో వారు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఆమెకి తెలుసు. ఇప్పటి వరకు దివ్యాంగుల ఇన్ఫో సొసైటి ద్వారా నాగశ్రీ 56 జంటల్ని ఒక్కటి చేశారు. ఆమె ప్రయత్నంతో దివ్యాంగుల ఒంటరి జీవితాలకు ఓ తోడు దొరుకుతుంది. నాగశ్రీ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.
"దివ్యాంగులను ఎలాగైనా ఓ ఇంటివారిని చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న. ఆయా జిల్లాల్లో వధూవరుల పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, నచ్చిన వారికి తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేస్తున్నాం. అలా ఒక్కటైన జంటలకు ఏడాది పాటు సంస్థ తరఫున బాసటగా ఉంటున్నాం"
నాగశ్రీ, దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటి అధ్యక్షురాలు
ఇదీ చదవండి:Home: ఇల్లు కట్టుకుంటారా... కట్టుకోలేమని రాసిస్తారా!