రాష్ట్రంలో కొన్నివేల మంది కొవిడ్ బారినపడి విషమ పరిస్థితుల్లోకి వెళ్లారు.. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటంతో శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండటంతో మరింత ఆందోళనకరమైన పరిస్థితులు చవిచూశారు. వీరిలో ఆరు పదుల వయసు దాటిన ఒకరైతే ఏకంగా మూడు రోజులపాటు కోమాలో ఉండిపోయారు. మరొకరైతే తన పక్కనే ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు కొవిడ్ బాధితులు చనిపోతున్నా ధైర్యం కోల్పోలేదు. ఇక్కడ చికిత్స చేయటం చాలా కష్టమని, మరో పెద్ద నగరానికి తీసుకెళ్లండంటూ వైద్యులే చెప్పినా.. మనోబలంతో అక్కడే వైద్యం పొంది కరోనాను గెలిచాడు ఓ యువకుడు. సకాలంలో వైద్యుల్ని ఆశ్రయించి గండంగట్టెక్కారు ఓ పెద్దాయన. మహమ్మారి నుంచి బయటపడే క్రమంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.
కుటుంబమంతా ఆక్సిజన్పైనే ఉన్నాం: -జె.రాజగోపాల్ (35), వ్యాపారి, మంగళగిరి
తొలుత మా నాన్న జె.ఎల్.పెరుమాళ్లు(64)కు కొవిడ్ నిర్ధారణైంది. మూడు, నాలుగు రోజుల తర్వాత నాకు, మా అమ్మకు లక్షణాలు మొదలయ్యాయి. హెచ్ఆర్సీటీ స్కాన్ చేయిస్తే అందరికీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటివరకూ మేమంతా హోమ్ ఐసొలేషన్లో ఉన్నాం. ఒక్కసారిగా మా నాన్నకు ఆయాసం మొదలైంది. ఆక్సిజన్ స్థాయి 85 శాతానికి పడిపోయింది. మా అమ్మకు కూడా అదే సమయంలో ఆక్సిజన్ శాతం తగ్గటం మొదలైంది. నాకూ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మా ముగ్గురికీ మధుమేహం ఉండటం, ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో ఆసుపత్రిలో చేరాం. ముగ్గురినీ ఆక్సిజన్పైనే ఉంచారు. ఆరు రోజుల చికిత్స తర్వాత అమ్మ చనిపోయారు. అప్పటికి నేను కొద్దిగా కోలుకున్నా.. మా నాన్న పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ఒకానొక దశలో ఆయన ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయింది. మా అమ్మ మరణవార్తను వెంటనే ఆయనకు చెప్పలేదు. భయపడినా, ఆందోళన చెందినా ప్రాణాలకే ప్రమాదమని అర్థమై.. ఏదైతే అదయ్యిందని నిబ్బరంగా ఉన్నాం. ఏడు రోజుల తర్వాత నన్ను డిశ్ఛార్జి చేస్తామన్నారు. కానీ నాన్న ఒక్కరే ఉంటే మరింత ఆందోళన పడతారని.. ఆయన కోలుకునే వరకూ అక్కడే ఉన్నా. మొత్తంగా 14 రోజుల పాటు ఆయన కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకోవాల్సి వచ్చింది. కేవలం మనోస్థైర్యం, వైద్యులు అందించిన చికిత్స వల్లే ఆయన, నేను అత్యంత విషమ పరిస్థితుల్లో నుంచి బయటపడ్డాం. ఆసుపత్రి నుంచి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మా నాన్నకు కాన్సంట్రేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అయితే ప్రాణానికేమీ ప్రమాదం లేదు.
ఇప్పటికీ నీరసమే...
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకున్నా.. పాజిటివ్ అని నిర్ధారణయ్యాక స్థానికంగా చికిత్స తీసుకోవటం మొదలుపెట్టా. కానీ ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటం ప్రారంభమైంది. నాకు మధుమేహం కూడా ఉండటంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. పది రోజులు ఆక్సిజన్పైనే ఉన్నా. మొత్తం 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. నా పక్కన చికిత్స తీసుకుంటున్న వారు ఒకరిద్దరు చనిపోయినా నేను ధైర్యంగానే ఉన్నా. నాకేమైనా అవుతుందేమోనన్న భయం ఎప్పుడూ కలగలేదు. స్టెరాయిడ్స్ వినియోగం వల్ల మధుమేహం స్థాయిలు కొంత పెరిగాయి. కోలుకున్నా ఇప్పటికీ నీరసంగానే ఉంది.
-పి.రామచంద్రరావు (54), శ్రీకాకుళం జిల్లా
జాప్యం చేస్తే చాలా ఇబ్బంది అయ్యేది
తొలుత నాకు జ్వరం వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుంటే నాలుగు రోజులైనా ఫలితం రాలేదు. అయిదో రోజున జ్వరం కొనసాగుతుంటే ఆందోళనతో హెచ్ఆర్సీటీ స్కాన్ చేయించా. అప్పటికే ఊపిరితిత్తుల్లో 40 శాతం మేర ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. గుండెదడ, శ్వాస తీసుకోవటంలో కొంచెం ఇబ్బంది మొదలయ్యాయి. నాకు పదేళ్లుగా రక్తపోటు ఉంది. ఇబ్బందవుతుందేమోనని భయపడి వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. ఒక రోజంతా ఆక్సిజన్ పెట్టారు. 5 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నా. అక్కడ అందించిన వైద్యం, నాకేం కాదులే అన్న నమ్మకంతో కరోనా నుంచి బయటపడ్డా. సీటీస్కాన్ చేయించటం, ఆసుపత్రిలో చేరటంలో ఏ మాత్రం జాప్యమైనా.. చాలా ఇబ్బంది ఎదుర్కొనేవాణ్ని.
-సూర్యప్రకాశ్రెడ్డి (57),ఉపాధ్యాయుడు, గుంటూరు జిల్లా
మూడు రోజులు కోమాలోనే
నాకు నాలుగు రోజులపాటు తీవ్రమైన దగ్గు రావటంతో కరోనా బారిన పడ్డానని నిర్ధారించుకున్నా. అప్పటికే ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం కంటే కిందకు పడిపోవటం మొదలైంది. నాకు పాతికేళ్లుగా మధుమేహం, రక్తపోటు ఉన్నాయి. దీంతో మరింత ఇబ్బందవుతుందేమోనని వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేరా. అప్పటికే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అధికంగా ఉందని హెచ్ఆర్సీటీ స్కాన్లో తేలింది. కాసేపటికే ఆక్సిజన్ స్థాయి 80కి పడిపోయింది. కృత్రిమంగా ఆక్సిజన్ అందించినా, చికిత్స ఇస్తున్నా.. కోలుకోలేకపోయాను. నాలుగు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లిపోయా. మూడు రోజులపాటు కోమాలోనే ఉండి తర్వాత స్పృహలోకి వచ్చాను. మొత్తంగా 11 రోజుల పాటు నాకు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. తర్వాత కరోనా నుంచి బయటపడి డిశ్ఛార్జి అయ్యాను. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా.
-పాత్రుని పాపారావు (64),విశ్రాంత ఆర్జేడీ, శ్రీకాకుళం జిల్లా
ఇక్కడ కష్టం.. చెన్నైకు తీసుకుపొమ్మన్నారు
రోడ్డు ప్రమాదానికి గురై రోజూ ఇంజక్షన్లు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లే క్రమంలో అక్కడే కరోనా బారిన పడ్డా. ఆ తర్వాత నుంచి ఆకలి వేసేది కాదు. విపరీతమైన చెమట పట్టేది. నాలుగు అడుగులు నడవలేకపోయేవాణ్ని. అయితే అది కరోనా అని గుర్తించటంలో ఆలస్యం చేశాను. అప్పటికే నా ఆక్సిజన్ స్థాయి 75 శాతానికి పడిపోయింది. హెచ్ఆర్సీటీ స్కాన్ చేయిస్తే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు తేలింది. నెల్లూరులోని ఆసుపత్రిలో చేరదామని వెళితే పరిస్థితి విషమంగా ఉందన్నారు. తమ వల్ల కాదని, చెన్నై తీసుకెళ్లిపోవాలని చెప్పారు. అక్కడికి వెళ్లేలోపు ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని భయపడి, మా సొంత రిస్క్తో నెల్లూరు ఆసుపత్రిలోనే చేరాం. నాలుగు రోజులు ఆక్సిజన్పైనే ఉండాల్సి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్తే ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోయేది. నాకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేకపోవటం, వైద్యులు మెరుగైన చికిత్స అందించటంతో వారం రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చాను.
-హజరత్ (29), వ్యాపారి, నెల్లూరు జిల్లా
పక్కనే రోజూ ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నా...భయపడలేదు
కరోనా బారినపడ్డానని తెలుసుకునేసరికే నా ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. ఆక్సిజన్ స్థాయి 80కి పడిపోయింది. నాకు రక్తపోటు ఉంది. నిత్యం వ్యవసాయ పనులు చేసుకుంటా. అందుకే ఎలాగైనా కోలుకుంటాననే ధైర్యం ఉండేది. వెంటనే మదనపల్లె ఏరియా ఆసుపత్రిలో చేరాను. అయిదు రోజులు ఆక్సిజన్పైనే ఉండాల్సి వచ్చింది. ఆసుపత్రిలో నా గదిలో ఉండేవారు రోజూ ఇద్దరు, ముగ్గురు చనిపోయేవారు. వారిలో కుర్రాళ్లు కూడా ఉన్నారు. అయినా భయపడలేదు. కోలుకుని బయటపడతాననే నమ్మకంతోనే ఉండేవాణ్ని. ఆసుపత్రులో నర్సులు, వైద్యులు రోజూ వచ్చి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటుంటే మరింత ధైర్యం కలిగేది. వారిచ్చిన మందులు, చికిత్స, నా మొండిధైర్యం వల్లే కరోనాను జయించగలిగా. ఇప్పటికీ కొద్దిగా దగ్గు వస్తున్నా మరీ ఇబ్బందికరంగా లేదు.
- అబ్దుల్ హకీం (66),రైతు, చిత్తూరు జిల్లా
- ఈనాడు, అమరావతి
ఇదీ చదవండి: