
రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదని... జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒప్పందం ప్రకారం... భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని... ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ... ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతులను నెట్టేశారని విమర్శించారు. 28 వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని... వీరికి ఈ ఏడాది రూ.189.7 కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉందన్నారు. సి.ఆర్.డి.ఎ రైతులతో చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించాలన్నారు.
కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారని... జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన కౌలు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. జూన్ 21న కౌలు విడుదల చేస్తున్నట్లు 2 జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ ఆ మొత్తం రాలేదని చెప్పారు. ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందన్నారు.
తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారని... ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. తమకు న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయమని... తక్షణమే కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: