కరోనా నివారణ మందుల్ని బాధితుల శరీరంలోకి ఎక్కించడానికి అవసరమైన 100 ఎం.ఎల్. పరిమాణముండే సాధారణ సెలైన్.. గుంటూరు జిల్లా కరోనా ఆస్పత్రిలో నిండుకుంది. వైద్య సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకొని వాటిని బయట కొని తెచ్చి రోగులకు పెట్టిస్తున్నామని.. బాధితుల తరుఫు బంధువులు వాపోతున్నారు. ఇండెంట్ పెట్టి తెప్పించడంలో అధికారులు, సిబ్బంది నడుమ సమన్వయ లోపమే దీనికి కారణమని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు.
కరోనా బాధితులు కోలుకోవడానికి స్టెరాయిడ్, హెఫారిన్, రెమ్డెసివిర్ మందులను వాడుతున్నారు. వీరు వాటిని రోగి శరీరంలోకి 100 ఎం.ఎల్. సెలైన్ ద్వారా ఎక్కించాలని వైద్య సిబ్బందికి సూచిస్తున్నారు. సిబ్బంది వాటిని ఎక్కించడానికి అవసరమైన ఆ సెలైన్ లేదని చెప్పడంతో బాధితుల తరుఫు బంధువులనే బయట కొని తెచ్చుకోండని ఇక్కడి వైద్య సిబ్బంది పురమాయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రికి అధికారికంగా కేటాయించిన పడకలు 220. కానీ ఇక్కడ చికిత్స పొందడానికి బాధితులు పెద్ద సంఖ్యలో రావడంతో అదనంగా పడకలు వేయించి కూడా చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చివరి దశలో ఇక్కడికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరికి స్టెరాయిడ్, హెఫారిన్, రెమ్డెసివిర్లలో ఏదో ఒకటి విధిగా ఎక్కించాల్సి వస్తోందని, అందుకు ఈ పరిమాణంలోని సెలైన్ సీసాలు అవసరమవుతున్నాయని చెప్తున్నారు.
- గుంటూరు జిల్లా ఆస్పత్రిలో ప్రతి మూడు నెలలకోసారి అవసరమైన మందులు, తదితరాలను పంపించాలని కోరుతూ సెంట్రల్ డ్రగ్ స్టోర్కు ఇండెంట్ పంపుతారు. ఇక్కడ వంద ఎం.ఎల్ పరిమాణం సాధారణ సెలైన్ వాడకాన్ని బట్టి ఫార్మాసిస్టు మూడు నుంచి ఐదు వందల వరకు ఇండెంట్ పెడుతుంటారు. ఆ పరిమాణం కన్నా అధిక సంఖ్యలో కరోనా బాధితులు ఇక్కడికి రావడంతో అది కాస్తా నిండుకుంది.
- గతంలో ఇండెంట్ పెట్టి తెప్పించిన సెలైన్ అయిపోయిందని, సెంట్రల్ డ్రగ్ స్టోర్కు ఇండెంట్ పెట్టామని జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రాణవాయువు ఉంటేనే పడక