National Level Kabaddi at Tirupati: తిరుపతి వేదికగా జాతీయ కబడ్డీ క్రీడల నిర్వహణ చారిత్రాత్మక ఘట్టమని ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ మహిళ, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్, అర్జున్ అవార్డు గ్రహీత హోసన్న గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవిష్కరించగా క్రీడా పతాకాలను పుల్లెల గోపీచంద్, హోసన్న గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన క్రీడాకారులు ఇందిరా మైదానంలో కవాతు చేసి వందనం సమర్పించారు. అతిథులు శాంతి కపోతాలు, గాలిబుడగలు ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు.
తొలి పోటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల మహిళ, పురుషుల జట్లు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కబడ్డీ క్రీడాకారులను తిరుపతి ఇందిరా మైదానం వేదికపైకి తీసుకురావడంతో పాటు పోటీల నిర్వహించడంలో పలువురి కృషి ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. కొవిడ్ తరువాత జరుగుతున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం విశేషమని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పడతాయని.. బావితరాలకు క్రీడా స్ఫూర్తిని అందించే లక్ష్యంతో పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి
మోదీ ర్యాలీ రద్దుపై మాటల యుద్ధం.. 'ఫ్లాప్ షో అని తెలిసే ఇలా..'