కరోనా కారణంగా విద్యార్థులు తరగతులను నష్టపోయినందున డిగ్రీ పరీక్షల్లో మరింత ఛాయిస్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు పరీక్షలంటే భయపడకుండా ఏం చేయాలన్న దానిపై కసరత్తు జరిపింది. ప్రత్యామ్నాయాలను సూచిస్తున్న మండలి తుది నిర్ణయాన్ని విశ్వవిద్యాలయాలకే వదిలివేయనుంది.
డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు పైసెమిస్టర్లలోకి వెళ్లేందుకు కనీస క్రెడిట్లు సాధించాలన్న నిబంధన ఇప్పటికే ఉంది. దాన్ని ఎత్తివేసి ‘నో డిటెన్షన్’ విధానం అమలుచేయాలని భావిస్తున్న అధికారులు.. పరీక్షలు జూన్ లేదా జులైలోనే జరిగే అవకాశాలు ఉన్నందున యూజీసీ కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు.
- రెండు విధానాలపై ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో ఇప్పటి ప్రశ్నపత్రాల్లో ఉన్నవాటి కంటే ప్రశ్నల ఛాయిస్ పెంచాలన్నది ఒకటి.
- ఇక రెండోది లాక్డౌన్ కంటే ముందు పూర్తయిన సిలబస్ నుంచే మొత్తం ప్రశ్నపత్రాన్ని రూపొందించడం. దీనివల్ల చదువులో సాధారణ విద్యార్థులు సైతం ఇబ్బంది పడకుండా పరీక్షలు రాస్తారని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
జేఎన్టీయూహెచ్ పరీక్షలు ఆగస్టులో!
బీటెక్ చివరి సంవత్సరం పరీక్షలు జూన్ నెలాఖరు లేదా జులైలో జరపాలని, మిగిలిన సంవత్సరాలవి వచ్చే ఆగస్టులో జరపాలని జేఎన్టీయూహెచ్ ఆలోచిస్తోంది. కళాశాలలు తెరిచి కొద్ది రోజులు తరగతులు నిర్వహించాకే పరీక్షలు పెట్టాలని భావిస్తోంది. ఏఐసీటీఈ సిఫారసులు వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు!