ఉద్యోగ అవకాశాలలో యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని పరిశ్రమలు, ఐటీ, జౌళీ, శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పారిశ్రామిక, ఉపాధి రంగాలలో యువతకు భాగస్వామ్యం చేయాలని , కోవిడ్-19 పరిణామాల తర్వాత అన్ని రంగాలలో మార్పు అనివార్యమని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు.
పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. 7 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... త్వరితగతిన ఆయా జిల్లాలలో కళాశాలల ఏర్పాటుకు గల స్థల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిచోట కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణాల కోసం భూమిని సేకరించాలని సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఇవ్వనున్న ఎమ్ఎస్ఎమ్ఈల ప్రోత్సాహకాల చెల్లింపులకు అవసరమయిన ఏర్పాట్లపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. మూతపడ్డ పరిశ్రమలు, కోవిడ్- 19 కారణంగా సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలస కూలీల వివరాలతో పాటుగా..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి, యువకులు వివరాలను సేకరించాలని ఆదేశించారు.