ఎవరికి ఏం ఇచ్చారు... సాధారణంగా ఏటా బడ్జెట్ రోజు జరిగే చర్చ ఇదే. ఈ పరిధిని దాటి ఆలోచిస్తే ఈ సారి భారీ లక్ష్యాలనే నిర్దేశించుకున్నట్లు ప్రకటించారు... కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. వాటిల్లో ప్రధానమైనది... సంక్షోభం నుంచి స్వయంసమృద్ధ భారతం దిశగా పడాల్సిన అడుగులు. ఆ క్రమంలో ముందుగా కనిపించేది... 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ నినాదం ....!
ప్రాజెక్టుల సంఖ్యపెంపు..
2024-25 నాటికి భారత్ చేరుకోవాల్సిన నిర్ధేశిత లక్ష్యమిది. దాంతోపాటు 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే బలమైన మౌలిక సదుపాయాల ఆవశ్యకత ఎంతో అవసరం. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఇదే విషయం మరోసారి ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే... 2019లో ప్రకటించిన జాతీయ మౌలికవసతుల కల్పన విభాగం ఎన్ఐపీ మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి ప్రకటించారు. ఈ విభాగంలోని ప్రాజెక్టుల సంఖ్యను 7 వేల 400కు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే 1.10 లక్షల కోట్ల విలువైన 217 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు పెంచనున్నట్లు తెలిపారు. 20 వేల కోట్ల మూలధనంతో ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి నిధుల కొరత లేకుండా చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ సంస్థ ద్వారా రానున్న మూడేళ్లలో దాదాపు 5లక్షల కోట్లు రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉపసంహారణ వేగవంతం
ఇదే సమయంలో రానున్న ఆర్ధిక సంవత్సరంలో మూలధనవ్యయాలను గణనీయంగా పెంచనున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధికమంత్రి. 2020-21తో పోల్చితే 34.5%పెంచి 5.54లక్షల కోట్లు కేటాయించారు. ఎన్ఐపీ కింద కాలపరిమితి నిర్దేశించుకుని ప్రాజెక్టలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దాన్లో భాగంగానే... వ్యవస్థగతంగా కొత్త సంస్థల ఏర్పాటు... ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయనున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు పెట్టుబడులతో పాటు... రానున్న రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి కూడా మూలధనం వ్య యాలు పెంచనున్నట్లు ప్రకటించారు.
గుత్తాధిపత్యం తగ్గించేందుకు చర్యలు
మౌలిక, తయారీ రంగానికి కీలకమైన విద్యుదుత్పత్తికి సంబంధించి... గడచిన ఆరేళ్లలో అనేక సంస్కరణల ద్వారా 139 గిగావాట్ల అదనపు ఉత్పత్తి చేయడం సహా దేశంలో చిట్టచివరి ఇంటికి కూడా విద్యుత్ వెలుగులు అందించినట్లు మంత్రి ప్రకటించారు. విద్యుత్ పంపిణీ సంస్థల గుత్తాధిపత్యం తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టినట్లు తెలిపిన నిర్మల..నూతన సంస్థల మనుగడకు 3 లక్షల కోట్లకు పైగా నిధులతో ఓ విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు సరిపడేలా సంప్రదాయేతర ఇంధనం వైపు దృష్టిసారించినట్లు ప్రకటించారు. హరిత విద్యుత్ ఉత్పాదక వనరులకు సంబంధించి సమగ్ర హైడ్రోజన్ ఇంధన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ఉపరితల రవాణా, రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చిన నిర్మలా సీతారామన్....భారత్ మాల, సాగర్ మాల ప్రాజెక్టులకు రికార్డుస్థాయిలో నిధులు కేటాయించారు. 5.3 లక్షల కోట్లతో ప్రకటించిన భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా.... 3.3లక్షల కోట్లతో 13వేల కిలోమీటర్లలో 3వేల 800 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మార్చి 2022 నాటికి మరో 8,500 కిలోమీటర్లు కలిపి అదనంగా 11వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను పూర్తి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉపరితల రవాణా శాఖకు లక్షా 18వేల 101 కోట్లు ప్రతిపాదించిన మంత్రి...ఇందులో లక్షా 8 వేల 230 కోట్లు మూలధన నిధులు ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా 2020-30 జాతీయ రైలు ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
13 రంగాలకు పీఎల్ఐ ప్రకటన
5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన నిర్మలాసీతారామన్ ... తయారీ పరిశ్రమ ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం కావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 13 రంగాలకు పీఎల్ఐ విధానాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 1.97లక్షల కోట్ల రూపాయలు కేంద్రం వ్యయం చేయనునన్నట్టు తెలిపారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది: నిర్మలా సీతారామన్
ఈ విధానాలు అమలులోకి రావటం వల్ల దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలాసీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడులు, భారీగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా.. ప్రపంచస్థాయి వసతులతో మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్స్ పార్క్స్... మిత్రా పథకంలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 7 పార్కుల్ని స్థాపించనున్నట్లు నిర్మలాసీతారామన్ పద్దులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గోడలు కాదు.. వంతెనలు నిర్మించండి: రాహుల్