గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రూ.5లక్షల్లోపు విలువ పనులకు 20శాతం సొమ్మును మినహాయించి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. తద్వారా రూ.409 కోట్లు విడుదల చేయనున్నారని వివరించారు. రూ.5లక్షలపైన విలువ పనులకు ఎంత మినహాయించాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎన్ఆర్ఈజీఎస్ కింద 2019 జూన్ 1లోపు నిర్వహించిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియరు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పి. వీరారెడ్డి వాదించారు. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి బిల్లులు సిద్ధం చేశారని, ఈ దశలో సొమ్ము చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని తెలిపారు. అక్రమాలున్న చోట బిల్లులను నిలిపేయడం సబబని, దీనికి భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా చెల్లింపులను ఆపేశారని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణ కూడా లేదని, ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.
ఇదీ చదవండి: