వాలంటీర్లపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీకి ఇబ్బంది లేదని ధర్మాసనానికి ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే తాము చర్యలు తీసుకున్నామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని ధర్మాసనానికి తెలిపారు. దాదాపు 600 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. లబ్ధిదారులను అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను స్థానిక నేతలు ప్రభావితం చేసి అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుంటున్నారని వాదనలు వినిపించారు. పోలింగ్ సందర్భంగా ఓటర్ స్లిప్పుల పంపిణీలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ అనుచరులకు స్లిప్పులు ఇచ్చి, ప్రత్యర్థి వర్గాలకు స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. అందువల్లనే వాలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల ప్రక్రియలో నివారించాలని పిటిషనర్లు కోరారు. వాదనలు ముగియటంతో ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్లో ఉంచింది.
ఇదీ చదవండి: ఎస్ఈసీ నిర్ణయంపై 4 లంచ్మోషన్ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు