hc on liquor digital payments: మద్యం దుకాణాల్లో చెల్లింపులు డిజిటల్ విధానంలోనే జరపాలని ఏ చట్ట నిబంధనలను చెబుతున్నాయో కోర్టు ముందు వివరాలు ఉంచాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మద్యాన్ని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉండదు కదా ? అని పిటిషనర్ను ప్రశ్నించింది. మొత్తం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడితే వారి హక్కులపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ కేంద్రం చట్టం చేసిందన్నారు. మరోవైపు జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ మద్యం కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికీ ఏటీఎం, డెబిట్ కార్డులు ఉండవు కదా అని ప్రశ్నించింది. అదనపు వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు న్యాయవాది సమయం కోరడంతో అందుకు అంగీకరించింది.
ఇదీ చదవండి:
Sajjala On Employees IR: ఐఆర్ 27 శాతం కంటే తగ్గకుండా చూడాలని సీఎం ఆదేశించారు: సజ్జల