గత నెలలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 13 సర్పంచి స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. నాలుగు చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మూడు చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఆరు సర్పంచి స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంప సముద్రం పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించాక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సర్పంచి అభ్యర్థిగా విజయం సాధించిన వెంగయ్యకు చెందిన అనుచరుల ఇళ్లపై ప్రత్యర్థులు దాడులకు దిగడంతో వివాదం తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం రావులుడికి, కర్నూలు జిల్లా పూడూరు, కడప జిల్లా వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె, నెల్లూరు జిల్లా చేజెర్ల మండలంలో మైపాటివారి కండ్రిక, వావిలేరు పంచాయతీల్లో సర్పంచి స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు. మరోవైపు 723 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ వేయగా 561 ఏకగ్రీవమయ్యాయి. 105 స్థానాల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. 55 స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి: ఈ బడ్జెట్ సమావేశాల్లోనే విద్యుత్ సవరణ బిల్లు!