NO SUPPORT: జాతీయ సంస్థల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించాల్సిన రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. యోగా, నేచురోపతి వైద్య, పరిశోధన సంస్థ ఏర్పాటుపై తన బాధ్యతను నెరవేర్చడంలేదు. మంగళగిరి ఎయిమ్స్ తరహాలోనే ప్రకృతి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నా చొరవ తీసుకోవడంలేదు. తెదేపా హయాంలో చంద్రబాబు కృషితో ఏపీలో ఈ సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భవనాల నిర్మాణానికి రూ.150 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రం ఉచితంగా భూమిని, విద్యుత్తు, నీటి సదుపాయం కల్పిస్తే సరిపోతుంది. అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరంలేదు. అయినా... సంస్థ ఏర్పాటులో రాష్ట్ర విముఖతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
2018లో కేటాయించిన స్థలం వెనక్కి
రాష్ట్ర విభజనకు ముందు నుంచి హైదరాబాదులోని ‘నేచురోపతి’ సంస్థ ద్వారా ఓపీ, ఐపీ ద్వారా రోగులకు సేవలు అందుతున్నాయి. విభజన అనంతరం ఏపీలో ఇలాంటి సంస్థ లేకుండా పోయింది. గత ప్రభుత్వం పట్టుబట్టడంతో కేంద్రం సెంట్రల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, నేచురోపతి (సీఆర్ఐవైఎన్) సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. విజయవాడ శివారు గన్నవరం సమీపంలోని కొండపావులూరు వద్ద 25 ఎకరాలను 2018 జులై 5న సంస్థకు బదిలీ చేశారు. పనులు ప్రారంభించేందుకు కేంద్రం సమాయత్తం అవుతుండగానే భూమిని రాష్ట్ర ప్రభుత్వం పేదల అవసరాలకు మళ్లించింది. సమీపంలోనే మరో 25 ఎకరాలను కేటాయించేందుకు సుముఖమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అధికారిక చర్యలు మాత్రం కొరవడ్డాయి. అయితే ఆస్థలంపై ఇతరుల దృష్టి పడకుండా ఉండేందుకు సంబంధిత శాఖ వారు బోర్డు పాతుకున్నారు.
రోగులకు ప్రయోజనం... యువతకు ఉపాధి
ఈ సంస్థ ఏర్పాటైతే తొలిదశలో వంద పడకలు ఏర్పాటు చేస్తారు. రోగులకు ఐపీ, ఓపీ ద్వారా వైద్యం అందుతుంది. కనీసం 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. యోగాలో శిక్షణ, పరిశోధనలు జరుగుతాయి. ఇటీవల యోగా, నేచురోపతి (ప్రకృతి వైద్యం)ని పాటించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయినా... సంస్థ ఏర్పాటుకు రాష్ట్రం ఆసక్తి చూపకపోవడంపై అధికారులకు దిక్కుతోచడం లేదు. కేంద్రం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. మంగళవారం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలోగానైనా రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చొరవచూపాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు... విశాఖలో నేచురోపతి వైద్య కళాశాలను స్థాపించేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఇందుకు అవసరమైన రూ.3 కోట్లను భరించాల్సి ఉంది. ఈ కళాశాల ఏర్పాటులోనూ ఎడతెగని జాప్యం జరుగుతోంది.
ఇవీ చదవండి: