ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలనపై తెదేపా విడుదల చేసిన ఛార్జిషీట్లో ఒక్క నిర్మాణాత్మక విమర్శ కూడా లేదని ఉపముఖ్యమంత్రులు అన్నారు. ఈ మేరకు 35 అంశాలతో ఉపముఖ్యమంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, అంజాద్బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారానికి దూరమయ్యామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోందన్న వారు... గత 3 నెలల్లో తన ఇల్లు ముంచేశారని, తాను కట్టిన ప్రజావేదికను కూల్చేశారనే మాటలే ఎక్కువగా వినిపించాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల కళకళలు చూసి అసూయ చెందారన్న ఉపముఖ్యమంత్రులు... మూడు నెలలు కాకముందే రాయలసీమ కరవు పాలైందంటూ ఛార్జిషీటులో రాశారని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రమంతా కరవే ఉందని 2019 జనవరిలో చంద్రబాబు ప్రభుత్వమే, కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ఛార్జిషీటులో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అమరావతిలో 50 వేల కోట్ల రూపాయల పనులు నిలిపివేశారని ఛార్జిషీటులో రాశారని... కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు అయితే.. మిగతా మొత్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పథకాల అమలుకు... సగర్వంగా షెడ్యూల్ ప్రకటించామన్న ఉపముఖ్యమంత్రులు.. మేనిఫెస్టో అమలు చేసే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.
రైతులు బకాయిలు చెల్లించాలని తెలీదా?
- 2014 జూన్ 8న తొలి సంతకంతోనే రైతుల రుణాల మాఫీ చేశామని చెప్పారు కదా? 2019లో నాలుగైదు వాయిదాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్నికల్లోగా బకాయిలు చెల్లించాలని ఎందుకనిపించలేదు?
- ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కేసీఆర్ కు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది. సాష్టాంగపడిందీ చంద్రబాబే. హైదరాబాద్ భవనాల్నీ ఖాళీగా పెట్టి... ఇక్కడ కావలసిన వారి భవనాలకు కార్యాలయాల పేరిట ఎన్ని వేల కోట్లు దోచిపెట్టారు?
- కియా మోటార్స్, పేపర్ పరిశ్రమ వంటివి రాష్ట్రం నుంచి పరారయ్యాయనటం ఆయన నేరపూరిత ఆలోచనలకు నిదర్శనం. ఏవీ వెళ్లలేదు.
- అన్న క్యాంటీన్లలో పెట్టిన ఏ మెతుక్కీ తెదేపా ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు.
- చివరి రెండు నెలల్లో రూ. 2 వేల చొప్పున ఇచ్చి నిరుద్యోగుల్ని ముంచిన చంద్రబాబుకి వారి గురించి మాట్లాడే అర్హత లేదు.
ఇదీ చదవండి : '100 రోజుల జగన్ తుగ్లక్ పాలన'