విజయవాడ గొల్లపూడిలో 'దిశ యాప్'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మహిళ పోలీసు, వాలంటీర్ల ద్వారా యాప్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యాప్ వల్ల మంచిని తెలియజేస్తూ..ఎలా వాడాలో తెలియజేయాలని వాలంటీర్లకు సూచించారు. ప్రతి మహిళ సెల్ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందన్న ఆయన..ఇలాంటి ఘటనలు ఆపేందుకు దిశ యాప్ అందుబాటులో తెచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ యాప్ ఇప్పటికే 4 అవార్డులు గెలిచిందన్నారు. ఇప్పటివరకు 17 లక్షల మంది దిశయాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్న సీఎం.. కోటి మంది మహిళలకు డౌన్లోడ్ చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దిశ యాప్ ఉంటే మహిళ ఎక్కడికి వెళ్లినా అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్లేనన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని..ఫోన్ చేయలేకపోయినప్పటికీ ఫోన్ ఊపినా పోలీసులను సమాచారం వెళ్తుందని చెప్పారు. మహిళల భద్రత కోసం 900 మెుబైల్ పెట్రోల్ వాహనాలను ప్రారంభించినట్లు తెలిపిన సీఎం.. మరో వారం రోజుల్లో వాహనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. మహిళలు ఎక్కడికైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా అనుమానంగా ఉంటే యాప్ ద్వారా 'ట్రాక్ మై ట్రావెల్' బటన్ నొక్కవచ్చన్నారు. ప్రయాణ మార్గం సెల్ ఫోన్లో చెప్పడం సహా వాహనం ఆ మార్గంలో వెళ్లకపోతే అలర్ట్ చేసే అవకాశం యాప్ లో ఉందని..వాహనాన్ని దారి మళ్లించినపుడు బటన్ నొక్కితే వెంటనే పోలీసులు వచ్చి రక్షిస్తారని సీఎం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: