తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ శార్వరి నామసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షిన ఆయన... ఇళ్లలోనే ఉండి ఉగాదిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేడుకలకు దూరంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కుటుంబ భద్రత, సామాజిక భద్రత అందరి సంకల్పం కావాలని ఆకాక్షించారు. కరోనా తీవ్రత దృష్ట్యా సామాజిక దూరం పాటించి సోషల్ డిజిటలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినందునా... ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే, మానవ జీవితంలోనూ కష్టాలు-నష్టాలు, సుఖాలు-దుఃఖాలు కలబోసి ఉంటాయనేది ఉగాది పండుగ పరమార్థంగా ప్రతి ఒక్కరు గుర్తు ఉంచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోరాదనేదే ఉగాది సందేశంగా గుర్తుచేశారు. విపత్తులు ఎన్ని ఎదురైనా గట్టి పట్టుదలతో ఎదుర్కొందామన్న చంద్రబాబు... మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదామన్నారు. వికారికి వీడ్కోలు పలుకుదాం-శార్వరిని స్వాగతిద్దామని చెప్పారు.
ఇదీ చదవండి : లాక్డౌన్: నిర్లక్ష్య ధోరణికి లాఠీ దెబ్బ