
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మలేషియాలోని కౌలాలంపూర్, ఇతర దేశాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు స్వస్థలాలకు వచ్చేలా తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. 'మలేషియాలోని కౌలాలంపూర్లో చిక్కుకుపోయిన తెలుగువారిని భారత్కు తీసుకువచ్చేందుకు మీరు చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కౌలాలంపూర్లో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చేందుకు మీరు వెంటనే స్పందించడం ప్రశంసనీయం. మీరు చేసిన సాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోరు. అలాగే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సేవలందించిన మీ సిబ్బందికి, ఎయిర్ ఆసియాకు కృతజ్ఞతలు' అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు 50-60 రోజుల సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సోమవారం సూచించింది. దీనివల్ల వందలాదిమంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం మనీలా (ఫిలిప్పీన్స్) విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్ మీదుగా భారత్కు రావాలి. కొందరు కౌలాలంపూర్లో, మరికొందరు మనీలాలో చిక్కుకుపోయారు. అయితే భారత్ వచ్చే విమానాలన్నీ రద్దయిన కారణంగా వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. కౌలాలంపూర్లో 150 మంది, మనీలాలో 60 మంది ఇలా చిక్కుకుపోయారు. విమానాలను అనుమతిస్తున్నట్లు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి జైశంకర్ ప్రకటన చేశారు.
సంబంధిత కథనం:భారత్కు పయనమైన తెలుగు విద్యార్థులు