రాష్ట్రంలో కుల రాజకీయాలను, ఎస్సీల అణచివేతను గాంధీ చూపిన అహింసా మార్గంలోనే ఎదిరిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ముందుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపడమే గాంధీజీకి మనం అందించే అసలైన నివాళి అన్నారు. మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ మహాత్ముడని కొనియాడారు. ఆయన నమ్మి ఆచరించి చూపిన సిద్ధాంతాలు కాలానికి అతీతమైనవిగా పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.
లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో రైతు హక్కులను కాపాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. శాస్త్రి జయంతి సందర్భంగా జై కిసాన్ అన్న ఆ దేశభక్తుని స్పూర్తితో రైతు హక్కులను కాపాడేందుకు నడుం కడదాం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
సమాజ సమానత్వం సాధించేందుకు మహాత్ముడి మార్గంలో నడుద్దామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి వేళ రైతు సౌభాగ్యం, సమాజ సమానత్వం సాధించేందుకు ఆ మహాత్ముడు సూచించిన మార్గంలో నడుద్దామన్నారు.
రైతు సంక్షేమానికి, పల్లెల ప్రగతికి బాటలు వేసిన దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి అని లోకేశ్ కొనియాడారు. ఆ మహనీయుని స్ఫూర్తిగా రైతు సంక్షేమం కోసం నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు కృషి చేద్దామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు