Banjara and Adivasi Bhavans in telangana : వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో బంజారా, ఆదివాసీ వర్గాల కోసం భవనాలు నిర్మించింది. ఆయావర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్ల నిర్మాణం జరిగింది. ఎకరానికిపైగా విస్తీర్ణంలో విశాలంగా ఈ భవనాలను నిర్మించారు. ఆయా సామాజికవర్గాల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మాణాలు జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. 50 కోట్లకు పైగా వ్యయంతో కొద్దిరోజుల క్రితమే వాటి నిర్మాణం పూర్తైంది.
Banjara and Adivasi Bhavans inauguration : బంజారా, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నాగరికత ఉట్టిపడేలా భవనాలు నిర్మించారు. లోపలి గోడలపై అందంగా కళాకృతులు పేర్చారు. వారి కళలు ప్రతిబింబించేలా చిత్రాలు ఏర్పాటుచేశారు. సంస్కృతి, నాగరికతకు అద్దంపట్టేలాపనిముట్లు, వేటపరికరాలు, వస్త్రాలు, ఇతర సామాగ్రిని ప్రదర్శనగా ఉంచారు. కళాకృతులతో ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. సభలు, సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా భారీ స్టేజి, విశాలమైన సభా మందిరం నిర్మించారు. ప్రముఖుల కోసం ప్రత్యేకంగా లాంజ్లు సిద్ధంచేశారు. సమావేశ మందిరాలు, భారీ భోజనశాల, వంటశాలను ఏర్పాటుచేశారు. ఆయావర్గాల వారు . సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంతోపాటు శుభకార్యాలు జరుపుకునేందుకు అనువుగా వాటిని తీర్చిదిద్దారు.
పద్మశ్రీఅవార్డు గ్రహీతలు కనకరాజు, రామచంద్రయ్యకి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటి రూపాయల చొప్పున నగదు అందించనున్నారు. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన కళారూపాలతో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.