ఆస్తిపై దురాశతో బామ్మపై దౌర్జన్యానికి దిగాడు ఓ కిరాతక మనవడు. కుక్కతో కరిపించి తీవ్రంగా గాయపరిచాడు. ఈ హృదయవిదారక ఘటన దిల్లీలో వెలుగుచూసింది.
అసలేమైందంటే..?
70ఏళ్ల వృద్ధురాలు దిల్లీలోని తూర్పు వినోద్ నగర్ ప్రాంతంలో తన మవవడితో నివాసముంటుంది. బామ్మ ఆస్తిపై కన్నేసిన మనవడు.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ బామ్మను హింసించడం మొదలుపెట్టాడు. ఆరు నెలల క్రితం ఓ కుక్కను ఇంటి తీసుకొచ్చాడు. ఆ శునకాన్ని చూసి భయపడిన బామ్మ.. దాన్ని బయట వదిలేయమని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోని మనవడు.. ఆ కుక్కను ఇంట్లోనే ఉంచాడు. దానితోనే బామ్మను బెదిరించేవాడు. చిత్ర హింసలకు గురిచేసేవాడు. చివరకు ఆమెపై కుక్కను ఉసిగొల్పి.. కరిపించాడు. దీంతో విసుగుపోయిన బాధితురాలు జనవరి 13న దిల్లీ మహిళా కమిషన్ను(డీసీడబ్ల్యూ) ఆశ్రయించింది. హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేసి విషయాన్ని వివరించింది.
జనవరి 20న బాధితురాలిని కలిసిన డీసీడబ్ల్యూ బృందం.. వృద్ధురాలి ఒంటిపై గాయాలను చూసి విస్తుపోయింది. ఆమెకు అండగా నిలిచింది. కళ్యాణ్పురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 289 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీసీడబ్ల్యూ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్.. వృద్ధురాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. నోటీసులు జారీ చేశారు. బాధిత మహిళ భద్రత, కేసులో తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది మహిళా కమిషన్.
ఇదీ చూడండి: కదిలే రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు