విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్. పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఈ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దైవభక్తుల నిలయం ఈ రాష్ట్రం. ఇక్కడి ప్రజలు రకరకాల పూజా కార్యక్రమాలతో నిత్యం భక్తిలో ఉంటారు.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా గంగోల్గాంవ్ గ్రామస్థులు ఇటీవలే విశిష్టమైన 'ఉఖేల్ ఉబేద్' పూజ నిర్వహించారు. 24 గంటల పాటు జరిగే ఈ పూజా కార్యక్రమం సమయంలో గ్రామ సరిహద్దును మూసేస్తారు. గ్రామం ద్వారా పోయే గోపేశ్వర్-కేదార్నాథ్ రహదారిపైనా రాకపోకలు నిలిపివేస్తారు. దీనికోసం అధికారుల నుంచి అనుమతులు ముందుగానే పొందుతారు. ఈ పూజ జరుగుతున్నంత సేపు ఏ ఒక్క గ్రామస్థుడు ఊరు దాటి బయటికి వెళ్లడానికి వీల్లేదు. అలాగే బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించరాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా, బయటికి వెళ్లినా పూజ విఫలమైనట్లు భావిస్తారు గ్రామస్థులు. అందుకే ఎవరినీ రానీయకుండా గ్రామ సరిహద్దులో పహారా కాస్తారు.
ప్రత్యేక పూజ ఎందుకు?
చాలా ఏళ్ల క్రితం గంగోల్గాంవ్ గ్రామానికి కీడు సంభవించి ఎంతో మంది మరణించారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఊరి శ్రేయస్సు కోసం గ్రామస్థులు 'ఉఖేల్ ఉబేద్' పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
ఏప్రిల్ 4న ఉదయం 8 గంటలకు పండితులు పూజ మొదలుపెట్టిన మరుక్షణం నుంచి 24 గంటల పాటు గ్రామ సరిహద్దును మూసివేశారు గ్రామస్థులు. మరునాడు ఉదయం 8 గంటలకు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి:అందరికన్నా ముందే ఓటేసిన జవాన్లు..!