Siddipet Young Man Died in America : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన సాయి రోహిత్ (23)గా గుర్తించారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మహాదేవ్-గంగమ్మ దంపతుల పెద్ద కుమారుడు సాయి రోహిత్ 2023 డిసెంబర్లో అమెరికాలో ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లాడు.
జులై 22న సాయి తప్పిపోయాడని, రెండు రోజుల వ్యవధిలోనే ఓ సరస్సు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్నేహితులు గుర్తించి, మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమెరికాలోని తానా సహాయంతో మంగళవారం రోజున సాయి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూటిగల్ చేరుకొని మహాదేవ్ కుటుంబసభ్యులను పరామర్శించి, సాయి రోహిత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.