NREGS Worker Died in Siddipet Dist : ఉపాధిహామీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తున్కిఖల్సాలో జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో చెరువు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకు రాచకొండ గాలయ్య(37) అనే వ్యక్తి కూలీకి వెళ్లారు.
పని చేస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో తోటి కూలీలు ఆయనను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే గాలయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మండల పరిషత్ అధికారులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించారు.