Hydra Commissioner Ranganath Statement On Musi Development : మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీ నదిలో సర్వేలు, మార్కింగ్తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో వివరణ ఇస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఎక్కడ కూల్చివేతలు జరిగినా సామాజిక మాద్యమాల్లో హైడ్రాకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించిన రంగనాథ్ మూసీ సుందరీకరణ విషయంలోనూ హైడ్రాపై అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని తెలిపారు.
నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్నవారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని, మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టని చెప్పారు. దానిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వెల్లడించారు.