Govt Decision On Retired Irrigation Officers : నీటి పారుదల శాఖలో విశ్రాంత అధికారుల కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పదవీ విరమణ చేసిన 72 మందిలో 38 మంది విశ్రాంత ఉద్యోగులను కొనసాగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. 72 మందిలో పలువురు గతంలోనే రాజీనామా చేయగా, మరికొందరిని తొలగించారు. మిగిలిన వారి విషయంలో స్పష్టత ఇస్తూ, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు.
ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వారిలో ఎస్ఈ హోదాలో ఉన్న ముగ్గురు, ఈఈ హోదాలో ఒకరు, ఏఈ టెక్నికల్ ఆఫీసర్ల హోదాలో ఉన్న 37 మందిని మాత్రం కొనసాగించనున్నారు. టీజీపీఎస్సీ ద్వారా కొత్తగా ఏఈ, ఏఈఈల నియామకం పూర్తై, వారు విధుల్లో చేరే వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.