ACB Raids on Medchal Collectorate : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డిప్యూటీ రిజిస్ట్రార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లా పరిధిలోని భారత్ కో ఆపరేటివ్ బ్యాంక్కు ఖాతాదారులకు, కుటుంబ సభ్యులకు మధ్య వివాదం తలెత్తింది. వారి సమస్య పరిష్కారానికి డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాస రాజును సంప్రదించారు. ఆయన బాధితుల నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.
ఈ నెల 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు గురువారం రూ.లక్ష ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో శ్రీనివాస రాజును కలవగా పార్కింగ్లో ఉన్న కారులో డబ్బును పెట్టాలని సూచించారు. ఆయన మొదటి అంతస్తు నుంచి కారు రిమోట్ కంట్రోల్ డోర్స్ ఓపెన్ చేయగా అందులో నగదు పెట్టారు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులను పట్టుకుని శ్రీనివాస రాజును పట్టుకున్నారు.