High Court On Pinnelli Bail Petitions: పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలింగ్ రోజు పాల్వాయిగేటు కేంద్రంలోకి తన అనుచరులతో చొరబడిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డుకునే యత్నం చేసిన టీడీపీ ఏజెంట్పై దాడి చేశారు. తర్వాత రోజు కారంపూడిలో విధ్వంసానికి పాల్పడి, సీఐని గాయపరిచారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు కారాగారంలో ఉన్నారు. దిగువ కోర్టులో రెండుసార్లు బెయిలు కోసం ప్రయత్నించగా న్యాయస్థానం పిటిషన్లను కొట్టేసింది.