Sony Zee Settlement : విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో నెలకొన్న వివాదాలను ప్రముఖ మీడియా సంస్థలైన జీ, సోనీ సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. డీల్ రద్దు అనంతరం పరస్పరం పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఇతర ఫోరమ్స్లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాయి. ఎవరికి వారు మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారిస్తామని మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్తో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ) 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలీనం ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రెండేళ్ల అనంతరం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు సోనీ గ్రూప్ 2024 జనవరిలో ప్రకటించింది. దీంతో ఇరు సంస్థల మధ్య వివాదం నెలకొనగా, ఇప్పుడు పరిష్కరించుకున్నాయి.