Droupadi Murmu Got Fiji Highest Civilian Award : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ'ని అందుకున్నారు. రెండు రోజుల ఫిజీ పర్యటనకు వెళ్లిన ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు విలియమ్ మైవలిలీ కటోనివేరే ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. కాగా, భారత రాష్ట్రపతి ద్వీప దేశమైన ఫిజీలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఫిజీ, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఫిజీకి మిత్రదేశంగా ఉండటానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. తనకు లభించిన పురస్కారాన్ని రెండు దేశాల మధ్య ఉన్న గొప్ప స్నేహబంధానికి ప్రతిబింబంగా అభివర్ణించారు. అలాగే ఆమె ఫిజీ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఫిజీ పర్యటన అనంతరం ముర్ము ఆగస్టు 7-9 వరకు న్యూజిలాండ్లో పర్యటించనున్నారు.