Bihar Former Minister Father Murder : బిహార్ మాజీ మంత్రి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధ్యక్షుడు ముకేశ్ సహానీ తండ్రిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం దర్భంగా జిల్లా సుపాల్ బజార్లోని ముకేశ్ సహానీ నివాసంలో ఆయన తండ్రి జితన్ సహాని మృతదేహాం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆయన కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, గాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీనియర్ అధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకుని ఈ హత్యపై దర్యాప్తు చేపడుతోందని దర్భంగా ఎస్పీ జగనాథ్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, ఘటన జరిగిన సమయంలో ముంబయిలో ఉన్న ముకేశ్ సహానీ తండ్రి మరణవార్తను విని వెంటనే ఇంటికి బయలుదేరారు.
ముకేశ్ సహానీ 2020 వరకు నీతీశ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో విభేదాలు ఏర్పడి ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి, ఇండియా కూటమిలో చేరారు.