Amit Shah On Kharge Health : జమ్ముకశ్మీర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా, అవమానకరంగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీని గద్దె దించిన తర్వాతే మరణిస్తానని ఖర్గే చెప్పడం ప్రధానిని అనవసరంగా వివాదాల్లోకి లాగడమే అవుతుందని వ్యాఖ్యనించారు. మోదీ అంటే కాంగ్రెస్ నాయకులకు ఎంత ద్వేషం ఉందో ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. ఖర్గే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి, వికసిత్ భారత్ను చూడాలని ఆశిస్తున్నాని తెలిపారు. అందుకోసం మోదీతో పాటు అందరం ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కఠువా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ ప్రసంగిస్తూ, తాను ఎనభైలలో ఉన్నానని, ఇప్పుడే మరణించబోనన్నారు. మోదీని గద్దే దించే వరకు బతికే ఉంటానని వ్యాఖ్యానించారు.