By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 7:40 PM IST
గుడివాడలో వైసీపీ కార్యాలయం క్లోజ్ - ఐదేళ్ల మౌనం తరువాత స్వాధీనం చేసుకున్న హక్కుదారులు - YCP office vacated in Gudivada
YCP Office vacated in Sarath Theater of Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయం ఖాళీ అయ్యింది. గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొడాలి నాని శరత్ థియేటర్ను ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఎదురుచెప్పలేక మౌనంగా భరించిన థియేటర్ యజమానులు కూటమి ప్రభుత్వం రాకతో తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడుతున్న వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలను తొలగించారు. యాజమానుల్లో ఒకరైన మాజీ మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు శరత్ టాకీస్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ, గుడివాడ నడిబొడ్డున ఇన్నాళ్లూ అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందని ఆరోపించారు. ఇక్కడకి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆఖరికి ముగ్గురు హక్కుదారులు థియేటర్ వద్దకు వస్తే వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగారని తెలిపారు. దీంతో జరిగిన అన్యాయంపై థియేటర్ యాజమాన్యం తనతో చెప్పారని వెల్లడించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే గుడివాడలో పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కొడాలి నాని బ్యాచ్ కబ్జా చేసిందని బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రాము తెలిపారు.