By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 5:58 PM IST
పెట్రోల్ బంక్లో అక్రమాలు - చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్
Woman Angry Over Irregularities in Bharat Petrol Bunk: పల్నాడు జిల్లా గురజాల మండలం దాచేపల్లి భారత్ పెట్రోల్ బంకులో అక్రమాలు జరుగుతున్నాయంటూ సునిత అనే మహిళ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో పెట్రోల్ కోసం ఆమె భారత్ బంక్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ గన్లోని ట్రిగ్గర్ను పదేపదే నొక్కడాన్ని ఆమె గమనించారు. భారత్ పెట్రోలియం నిబంధనల ప్రకారం ఎవరైనా పెట్రోల్ కొట్టమని వస్తే కచ్చితంగా వాళ్లు చెప్పిన అమౌంట్ ఫీడ్ చేసి కొట్టాలి కానీ మాన్యువల్గా పెట్రోల్ ఎలా కొడతారని ఆమె ప్రశ్నించారు. ఆటోమేటిక్ మిషన్ పని చేయడం లేదని అందుకే మామూలు పద్ధతిలోనే పెట్రోల్ నింపుతున్నామని సదరు బంకు యజమాని వెంకటేశ్వరరావు బుకాయించారు. మిషన్ పని చేయకపోతే సూచన బోర్డు అమర్చాలని కానీ అలాగే పెట్రోల్ నింపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు.