By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 12:00 PM IST
నాలుగోసారి ఆస్తి పన్ను పెంపు - నెలాఖరులోగా చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి - Fourth Time Increase Property Tax
Property Tax Increase For Fourth Time Under YCP: కొత్త విధానంలో పెరిగిన ఆస్తి పన్ను వివరాలు పట్టణ, స్థానిక సంస్థలకు చేరడంతో పన్ను వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలాఖరు వరకు పాత బకాయిలతో సహా వసూలు చేసిన సిబ్బంది ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం పన్ను కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారు. గత ఏడాది ఆస్తి పన్నుపై 15 శాతం పెంచి 2024-25 సంవత్సరానికి సిద్ధం చేసిన తాఖీదులను పురపాలకశాఖ వెబ్సైట్లో పెట్టారు. జగన్ ప్రభుత్వంలో ఆస్తి పన్ను పెరగడం ఇది నాలుగోసారి.
ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా జగన్ సర్కారు మాత్రం 2021-22 నుంచే అమలు చేసింది. అప్పటి నుంచి పాత అసెస్మెంట్లపై ప్రతి సంవత్సరం 15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నారు. పట్టణ, స్థానిక సంస్థల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఆస్తి పన్ను మొత్తం ఎంత వంటి వివరాలు పురపాలకశాఖ గోప్యంగా ఉంచుతోంది. వెబ్సైట్లోనూ ఈ వివరాలు ఇప్పటివరకు పెట్టలేదు.