డీఎస్సీకి అభ్యర్థులకు జగన్ సర్కార్ షాక్ - మరోసారి రుసుము కట్టాలని సూచన
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 10:27 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-02-2024/640-480-20784496-thumbnail-16x9-dsc-notification.jpg)
Problems of Candidates to Apply for DSC: డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. ఎన్నికల వేళ ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన చేసి ప్రభుత్వం అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఫిర్యాదు చేయాలంటే సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పనిచేయవు. తప్పులు వస్తే సరిచేయడానికి ఐచ్ఛికం ఇవ్వకుండా మరోసారి 750 రూపాయలు రుసుము కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. దీనిపై అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని దీనికి తోడు దరఖాస్తులకే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం మాత్రమే వస్తోంది.
జిల్లాల జాబితా చూపడం లేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. జోన్ల జాబితా చూపకపోవడంపైనా అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత రావాల్సిన రిఫరెన్స్ ఐడీ కొన్నిసార్లు సక్రమంగా రావడం లేదు. కొందరికి 8 అంకెల నంబరు వస్తే మరికొందరికి 9 అంకెల నంబరు వస్తోంది. 9 అంకెలను నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు. మరోవైపు దరఖాస్తుకు 10 రోజుల సమయమే ఇచ్చారు. సర్వర్ సమస్య వల్ల వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారు.