వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు షాక్ - స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న భార్య - Wife Nomination Against Husband - WIFE NOMINATION AGAINST HUSBAND
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 6:48 AM IST
|Updated : Apr 19, 2024, 9:31 AM IST
Nomination of Wife Against YCP Leader Duvvada Srinivas: నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలిరోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలతో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆమె భర్త వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్ఠానం వాణిని నియమించింది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది.