సలహాలు ఇచ్చేవాళ్లకు క్యాబినెట్ హోదానా- మళ్లీ వారికి ఉప సలహదారులా!: నాదెండ్ల మనోహర్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 5:44 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20658920-thumbnail-16x9-nadendla.jpg)
Nadendla Manohar sensational comments: వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ అంశంపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందిని సలహాదారులను నియమించారు, వారు ఇచ్చిన సలహాలు, వారి జీత భత్యాలు ఏంటి అని మాత్రమే తాను అడిగానని నాదెండ్ల తెలిపారు.
తన ఆరోపణలపై సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు రాతలు రాశారని నాదెండ్ల మండిపడ్డారు. సాక్షిలో ఒకలాగా, సామాజిక మాధ్యమాల్లో మరోలా రాతలు ఖర్చులు చేసినట్లు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సలహాదారులుగా నియమించిన కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు లక్షల రూపాయల జీతం ఇస్తున్నారని చెప్పారు. కొంత మంది సలహాదారులకు ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారని చెప్పాలని డిమాండ్ చేశారు. సలహాదారుల నియామకంలో నూతన పాలసీని తెస్తామని హైకోర్టులో అఫిడవిట్ వేసిందని నాదెండ్ల గుర్తుచేశారు. ఇప్పటి వరకూ నూతన పాలసీని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. సలహాదారులతో పాటు ఉప సలహాదారులను నియమించడం హాస్యాస్పదంగా ఉందని నాదెండ్ల ఎద్దేవా చేశారు.