జగన్కు ప్యాలెసులంటే అమితమైన ప్రేమ: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Ramprasad Reddy on YSRCP Office
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 4:26 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/640-480-21809624-thumbnail-16x9-ramprasad-reddy-on-ysrcp-office.jpg)
Minister Ramprasad Reddy Inspected YSRCP Office in Rayachoti: రాష్ట్రంలో పేదలు గూడు నిర్మించుకోలేక అవస్థలు పడుతుంటే రాజులు కూడా నిర్మించుకోలేనంత ఐశ్వర్యవంతమైన భవనాలను వైఎస్సార్సీపీ నిర్మించుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సొంత భవనాలను నిర్మించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్కు భవంతులు, ప్యాలెస్ అంటే అమితమైన ప్రేమని, అందుకే ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ స్థలాలను కొట్టేసి కోట్ల విలువైన వైఎస్సార్సీపీ కార్యాలయాలను నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అడ్డదిడ్డంగా వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను, అధికారం అండతో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించిన వైఎస్సార్సీపీ నాయకులను కూడా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరి జేసీబీలు తెచ్చి కూల్చడం తెలుగుదేశం పార్టీ విధానం కాదని ప్రజాధనంతో నిర్మించిన ఈ కార్యాలయాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.