జగన్ వైఎస్ వివేకాను చంపిందెవరో చెప్పు - ఆ తర్వాతే ఓట్లు అడుగు : చంద్రబాబు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 8:05 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-03-2024/640-480-20892944-thumbnail-16x9-chandrababu-on-jagan.jpg)
Chandrababu Comments on Jagan about YS Viveka Murder: వైఎస్ వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాతే సీఎం జగన్ ఓట్లు అడగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం మీ చెల్లి ఐదేళ్లుగా పోరాడోతోందని ఆమెకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో హంతకులు ఎవరో, వారిని కాపాడుతోంది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికి రారని, ఎంతో బాధతో తన అన్న పార్టీకి ఓటు వేయొద్దని మరోసారి ఆపార్టీని గెలిపించొద్దని జగన్ చెల్లి సునీత చెప్పిందని గుర్తు చేశారు. సొంత చెల్లి అయిన షర్మిలకి ఆస్తిలో తనకు వెళ్లాల్సిన వాటా ఇవ్వని వ్యక్తి, ప్రజలకు న్యాయం చేస్తాడా అని చంద్రబాబు ప్రశ్నిచారు. జగన్ది వాడుకుని వదిలేసే విధానమని పేర్కొన్నారు. మహిళ అని చూడకుండా సొంత చెల్లిపై దుష్ప్రచారం చేసిన జగన్ని ఆడబిడ్డలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది తెలుగుదేశం- జనసేన కూటమేనన్నారు.